
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో నేషనల్ టెక్ ఫెస్ట్ 'హవానా 25' గురువారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఫెస్ట్ ఈఈసీసీ విభాగానికి చెందిన జీ-ఎలక్ర్టా ఆధ్వర్యంలో కొనసాగనుంది. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జి. రామేశ్వర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
విద్యార్థుల నైపుణ్యాలను పదును పెట్టడానికి హవానా లాంటి వేదికలు అవసరమని, పేపర్ ప్రజెంటేషన్లు, వర్క్షాప్ల వల్ల తమలోని ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంటుందని తెలిపారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఆర్ శాస్ర్తీ మాట్లాడుతూ హవానాలో భాగంగా డ్రోన్ రేసింగ్, రోబో రేస్, కోడెథాన్, ప్రోటో ఎక్స్ పో, గ్రిప్పర్ బాట్ ఛాలెంజ్, రోబో రెజ్లింగ్, హ్యాకథాన్, రోబో సాకర్ లాంటి ప్రజెంటేషన్లతో పాటు ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు, నిపుణులతో టెక్నాలజీపై లోతైన అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
దేశ నలుమూలల నుంచి 40 కాలేజీలకు చెందిన 150 బృందాలు ఈ ఫెస్ట్లో పాల్గొంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జెబీ దఫేదార్, జీ ఎలక్ర్టా ప్రెసిడెంట్ ఎం. సాయికృష్ణ, వైస్ ప్రెసిడెంట్ ఎం. నరేశ్, వివిధ పరిశ్రమల ప్రతినిథులు, టెక్ ఎక్స్పర్ట్లు పాల్గొన్నారు.